
హైదరాబాద్, వెలుగు: గిరిజనుల దేవతలు, పండుగలు, వాటి విశిష్టతను చాటి చెప్పేందుకు గిరిజన శాఖ విన్నూత పద్ధతికి శ్రీకారం చుట్టింది. మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ ట్రైబల్ కమిషనరేట్ లో 10 గిరిజన జాతుల దేవాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో లంబాడ, ఎరుకల, కొండరెడ్డి, చెంచు, తోటి,కోలామ్, కోయ, నాయక్ పోడు, పర్ధన్, గోండు, అంద సిరాల్ జాతుల దేవాలయాలను గుడెసెల రూపంలో నిర్మిస్తోంది. 70 ఫీట్ల విస్తీర్ణంలో మొత్తం 11 గుడిసెలు ఏర్పాటు చేసి అందులో ఆయా జాతుల విగ్రహాలు, పెయింటింగ్స్ ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
వీటి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. శనివారం ఈ టెంపుల్స్ ను ట్రైబల్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సముజ్వల, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ దేవాలయాలను వచ్చే నెల 2న ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైబల్ కమిషనరేట్ కు నిత్యం వివిధ జిల్లాల నుంచి గిరిజనులతో పాటు వందలాది మంది విజిటర్స్ వస్తుంటారు. వచ్చిన వాళ్లు ఈ దేవాలయాలను విజిట్ చేసేలా ఆకర్షణీయంగా నిర్మించారు.